Meghalaya | మేఘాలయలో అక్రమంగా మైనింగ్.. బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం.. 16 మంది మృతి

మేఘాలయలో అక్రమంగా కోల్ మైనింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 16 మంది మరణించి ఉండొచ్చని తెలుస్తోంది. మేఘాలయ, ఈస్ట్ జైంటియా జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

స్తానిక తంగ్స్కు ఏరియాలో బొగ్గు కోసం కొందరు ర్యాట్ హోల్ పద్ధతిలో మైనింగ్ చేస్తున్నారు. ఇది అక్రమం. దీనివల్ల పర్యావరణానికి హాని కలగడంతోపాటు ఈ పద్ధతిలో కార్మికులకు ప్రమాదకరం. అందుకే ఈ విధానాన్ని ప్రభుత్వం ఎప్పుడో నిషేధించింది. అయినప్పటికీ కొందరు ఆదాయం కోసం ఈ పద్ధతిలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. గురువారం మైనింగ్‌లో భాగంగా బ్లాస్టింగ్ చేస్తుండగా గని కూలినట్లు తెలుస్తోంది. దీంతో లోపల ఉన్న కార్మికుల్లో 16 మంది మరణించారని సమాచారం. ఒకరు తీవ్రంగా గాయపడగా అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం షిల్లాంగ్ తరలించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) టీం ఘటనా స్థలానికి చేరుకుంది.

గని లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గని లోపల ఎంతమంది చిక్కుకున్నారో ఇప్పుడే చెప్పలేమని జిల్లా ఎస్పీ వికాస్ కుమార్ అన్నారు. ఈ గని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించామని, బొగ్గు సేకరణలో భాగంగా నిర్వహించిన పేలుడే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *